Jagan: సప్తసముద్రాల అవతల ఉన్నా వదలం...! 1 y ago
వల్లభనేని వంశీపై తప్పుడు కేసు పెట్టారన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందన్నారు. వంశీ అరెస్టు చేసిన తీరు దారుణమన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ ఎలాంటి తప్పు చేయలేదని జడ్జి ముందు సత్యవర్థన్ తెలిపారన్నారు.
వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారన్నారు జగన్. ఆయన రెచ్చగొట్టడం వలనే గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిందన్నారు. పట్టాభిని చంద్రబాబే గన్నవరం పంపించి దాడి చేయించారన్నారు. పట్టాభి, అనుచరులు కలిసి ఒక ఎస్సీ వ్యక్తిపై దాడి చేశారన్నారు. అడ్డుకోబోయిన సీఐ కనకారావు తల కూడా పగలకొట్టారని చెప్పారు. టీడీపీ దాడులను ప్రతిఘటించే సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడిలో వైసీపీ, టీడీపీ నేతలపై పోలీసులు కేసు పెట్టారని చెప్పారు వైఎస్ జగన్. ఆ రోజు పోలీసులకు టీడీపీ మూడు ఫిర్యాదులు అందజేసిందన్నారు. టీడీపీ ఫిర్యాదులో ఎక్కడా వంశీ పేరు లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంశీని టార్గెట్ చేయడం మొదలు పెట్టిందన్నారు. అందుకే కేసును మళ్లీ రీ ఓపెన్ చేశారని తెలిపారు. బెయిల్ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు.
అధికారులకు, కూటమి నాయకులకు మాజీ సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నాయకులు చెప్పినట్టు చేసి పోలీసులు అన్యాయాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమన్నారు. అన్యాయంలో భాగస్వామ్యం కావొద్దన్నారు. ఎల్లకాలం టీడీపీ ప్రభుత్వం ఉండదని చెప్పారు. తమ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, వైసీపీ అధికారంలోకి రాగానే అన్యాయం చేసిన వారందరినీ దుస్తులు ఊడదీసి నిలబెడతామని పేర్కొన్నారు. రిటైర్డ్ అయిపోయినా సప్తసముద్రాల అవతల ఉన్నా కూడా వదిలిపెట్టమన్నారు. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.